చైత్ర నవల పరిచయం


        కొత్తతరం రచయితల్ని చూస్తే ఈర్ష్యగా ఉంటోంది, కథలో నవలో రాసేసి, సంప్రదాయ పద్ధతిలో పత్రికల వైపు చూడకుండా నేరుగా ముద్రించేస్తున్నారు. ఆ ధైర్యం కూడా మెచ్చుకోవాలి. ఫేస్ బుక్ తెరిస్తే నా స్నేహితుల్లో దాదాపు అందరూ వాళ్ళే కనిపిస్తున్నారు. ఇదొక మంచి పరిణామం. వాళ్ళలో ఒకరు Spoorthy Kandivanam గారు. తను చైత్ర నవల రాసేసి నేరుగా అచ్చు వేసుకున్నారు. అయితే దానికన్నా ముందు ఒక సెల్ఫ్ పబ్లిషింగ్ ప్లాట్ ఫాంలో దాన్ని సీరియల్ గా పెట్టి, పాఠకుల స్పందన తెలుసుకొని సంతృప్తి చెంది, ఆ తర్వాత అక్కడ తీసేసి, ఇప్పుడు నవలగా తీసుకువచ్చారు. ఆ ప్రయోగం బాగా నచ్చింది నాకు.

        ఈ నవల రెండు వారాల క్రితం నా దగ్గరికి వచ్చింది, చదవటం ఇప్పుడు పూర్తయ్యింది. చైత్ర పాత్ర తీరుతెన్నులు, ఆమె నేపథ్యం నవలకు ఆయువుపట్టు. నవల చదువుతూ ఉంటే మనకు అనుభవంలోకి వచ్చిన ఎందరో చైత్రలు మనకు గుర్తుకువస్తూ ఉంటారు. పది పదిహేను పేజీలు చదవటం కూడా పూర్తి కాగానే కథలోకి వెళ్ళిపోయి, తరువాత ఏం జరుగుతుందో అన్న ఉత్సుకత నెలకొంటుంది. సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ నవల ముఖ్యంగా ఆడవారికి చాలా బాగా నచ్చుతుంది. తండ్రి యాదయ్యను ఎదిరించి పడిలేచిన కెరటం చైత్ర.

        ఈ నవలలో నచ్చిన మరో అంశం, శైలి - నా దృష్టిలో స్క్రీన్ ప్లే అంటాను. ఒక్క సన్నివేశం కూడా తీసిపారేసేలా లేదు, అలా చేస్తే కంటిన్యుటి దెబ్బతిని, తరువాతి సీన్ అర్థం కాకుండా ఉండే ప్రమాదం ఉంది. అంత పకడ్బందీగా మొదటి నవలను రాయగలగటం నాకు ఒకింత ఆశ్చర్యంగానే అనిపించింది. అందుకు స్పూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
        
        పాలమూరు మాండలికంలో రాసిన మాటలు మట్టి పరిమళాన్ని వెదజల్లుతాయి. అయితే మొదటి నవల కావటం మూలాన చిన్న చిన్న పంక్చుయేషన్ ఎర్రర్స్ కనిపిస్తాయి, డి.టి.పి. చేసినప్పుడు కూడా ఆ ఎర్రర్స్ వచ్చే అవకాశం లేకపోలేదు, అయితే అవి నవల చదవటంలో అడ్డుపడవు.

        స్ఫూర్తి కందివనం గారు ఇది వరకే ఈనాడు, నమస్తే తెలంగాణ, ఇంకా ఒకటి రెండు కథల పోటీల్లో బహుమతులు గెలుచుకోవడం, పాలమూరు భాషలో వాటిని రాయటం, అవి బాగుంటడం నాకు గుర్తుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు ఆశిస్తూ, స్ఫూర్తి గారికి శుభాభినందనలు. చైత్ర విడుదలైన రెండు వారాల్లోనే కేవలం మౌత్ టాక్ ద్వారా 50 పుస్తకాలు అమ్ముడుపోయినందుకు డబుల్ కంగ్రాట్స్.

        ఈ చైత్ర నవల కావాల్సిన వారు Spoorthy Kandivanam గారిని ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి గనక వెళితే, అక్కడ 'అచ్చంగా తెలుగు' వారి స్టాల్ నం. 184 లో దొరుకుతుంది. 260 పేజీల నవల, ప్రస్తుతానికి 220 రూపాయలకే (పోస్టల్ చార్జీలు అధనం) లభిస్తోంది. ఈ పుస్తకం ఇప్పుడు అమేజాన్ ప్రైమ్‌లో కూడా అందుబాటులో ఉంది. కింద ఉన్న క్లిక్ క్లిక్ చేసి ఆర్డర్ చెయ్యొచ్చు

https://amzn.to/3uR4I8g

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి